....

Footer Right Content

Friday, January 7, 2011

శ్రీకృష్ణ సందేశం - 5

ఉన్నత విద్యాసంస్థల్ని విస్తరించాలి

అధ్యాయం-3
శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని 3వ అధ్యాయం తొలిభాగంలో విద్య, రెండోభాగంలో ఆరోగ్యంపై చర్చించారు.
ప్రజల నాణ్యమైన జీవన విధానానికి విద్య, ఆరోగ్య పరిస్థితులే ముఖ్యమైన సూచికలు. విద్య కేవలం సామాజిక సూచిక మాత్రమే కాదు ఆర్థిక, సామాజిక అభివృద్ధితో దానికి సంబంధం ఉంది. విద్యకోసం చేసే డిమాండ్ తమ పిల్లల భవిష్యత్ ఉజ్వలంగా ఉండాలన్న ఆకాంక్షను ప్రతిబింబిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ప్రాంతాల-తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర-లో విద్య, అక్షరాస్యత పురోగతిని సమీక్షించారు. ఆయా ప్రాంతాల వాదనలు తెలుసుకునేందుకు ఇది దోహదపడుతుంది. విద్యావకాశాల విషయంలో వివక్షకు లేదా నిర్లక్ష్యానికి గురయ్యామన్న తెలంగాణ ప్రాంత వాదన గురించి ఈ అధ్యాయం చర్చించింది.

రాష్ర్టంలోని వివిధ ప్రాంతాలలో విద్యా విజయాల పోలిక
అక్షరాస్యత విషయంలో అఖిలభారత స్థాయితో పోల్చితే ఆంధ్రప్రదేశ్ వెనకబడి ఉన్నా ఇటీవలి సంవత్సరాలలో ఆ అంతరం బాగా తగ్గుముఖం పట్టింది. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటినుంచి సార్వత్రిక విద్యపై ప్రత్యేక దృష్టి సారించడమే దీనికి కారణం. 2001లో రాష్ర్టంలో అక్షరాస్యత 60శాతం ఉండగా తెలంగాణలో 58 శాతం(హైదరాబాద్‌ను మినహాయిస్తే 55%), కోస్తాంధ్రలో 63%, రాయలసీమలో 60% ఉంది. మిగిలిన రెండు ప్రాంతాలతో పోల్చితే తెలంగాణ కొద్దిగా వెనకబడి ఉన్నా 1971 తర్వాత ఈ అంతరం క్రమేణా తగ్గిపోతూ వస్తున్నది. 1971-2001 మధ్య అక్షరాస్యత పెరుగుదల రేటు మిగిలిన ప్రాంతాల కన్నా తెలంగాణలోనే ఎక్కువ. రాయలసీమలో 144.67%, కోస్తాంధ్రలో 127.83% ఉండగా తెలంగాణలో 180.06% ఉంది. యువజన అక్షరాస్యత విషయానికొస్తే తెలంగాణలో 1983లో 46% ఉండగా రాయలసీమలో 51%, కోస్తాంధ్రలో 54% ఉంది. అయితే 2007 నాటికి తెలంగాణలో ఇది 89శాతానికి చేరుకుంది. రాయలసీమలో 82%, కోస్తాంధ్రలో 88% ఉంది. 8నుంచి 24 ఏళ్లలోపు అక్షరాస్యులైన జనాభా విషయంలో 1983లో మూడో స్థానంలో ఉన్న తెలంగాణ 2007కు ప్రధమస్థానంలోకి వచ్చింది.

అంతరాలకు అనేక కారణాలు...
భారత్‌లో తెలంగాణ ప్రాంతం విలీనమైన సమయంలో ఆ ప్రాంతానికి అనేక ప్రతికూలతలున్నాయి. ఉర్దూమీడియం ఒక్కటే ఉండడం, స్కూళ్లు, ఉన్నతవిద్యావకాశాలు ఎక్కువగా లేకపోవడం వంటివి అందులో కొన్ని. విలీనం నాటికి తెలంగాణలో క్వాలిఫైడ్ టీచర్ల కొరతుంది. కోస్తాంధ్ర టీచర్లతో దానిని భర్తీ చేశారు. 1969 లో ఉద్యమంలో ఇది కూడా ఒక ముఖ్యమైన అంశంగా మారిపోయింది. రాష్ర్టంలో కొన్ని భాగాలలో అక్షరాస్యత తక్కువగా ఉండడానికి చారిత్రక కారణాలతోపాటు కొన్ని సామాజిక, ఆర్థిక కారణాలూ ఉన్నాయి. రాష్ర్టవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలోనూ ఎస్సీల అక్షరాస్యతతో పోలిస్తే ఎస్టీల అక్షరాస్యత తక్కువ. ఎస్టీల జనాభా ఎక్కువగా ఉన్న తెలంగాణలో సహజంగానే మొత్తం అక్షరాస్యత తక్కువగా ఉండడానికి అదీ కారణమైంది. మహబూబ్‌నగర్, మెదక్, వరంగల్(మూడూ తెలంగాణ జిల్లాలు)లలో అన్ని స్థాయిల్లోనూ డ్రాపవుట్స్ నిష్పత్తి ఎక్కువగా ఉంది.

విద్యా సదుపాయాలు.. రాశిలోనూ వాసిలోనూ సూచికలు
విద్యాసదుపాయాల పంపకం సమాజంలో అవకాశాల పంపకాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తుంది. అందుకే మానవాభివృద్ధికి నాణ్యమైన విద్యాసంస్థలు అందుబాటులో ఉండడం అవసరం. ప్రాధమిక పాఠశాలలు 1960-61లో 30,495 ఉండగా 2008-09 నాటికి 65,609కి చేరుకున్నాయి. 1961తో పోల్చితే 2009 నాటికి ప్రాథమిక పాఠశాలలు రెట్టింపు అయినా పెరుగుదల కనిపించకపోవడానికి కారణం అనేక పాఠశాలలు అప్పర్ ప్రైమరీ పాఠశాలలుగా, హైస్కూలు స్థాయికి అప్‌గ్రేడ్ అయ్యాయి.

ప్రాథమిక పాఠశాలల విషయంలో రాయలసీమ ప్రథమస్థానంలో ఉంది. 1993 నుంచి తెలంగాణ మెరుగవుతూ వచ్చింది. రాయలసీమతో అంతరం తగ్గుతూ రాగా కోస్తాంధ్రకు దాదాపు దగ్గరకు చేరుకుంది. రాష్ర్టంలోని అన్ని ప్రాంతాల్లోనూ అప్పర్ ప్రైమరీ స్కూళ్లు బాగా పెరిగాయి. 1961-2001 మధ్య తెలంగాణలో పెరుగుదల ఎక్కువ ఉంది. 2008-09లో లక్షమంది జనాభాకు తెలంగాణలో 18.2 యూపీ స్కూళ్లుండగా రాయలసీమలో 20.4, కోస్తాంధ్రలో 15.3 స్కూళ్లు ఉన్నాయి. అన్ని ప్రాంతాల్లోనూ హైస్కూళ్ల సంఖ్య పెరిగింది. 1961లో మిగిలిన ప్రాంతాలతో పోల్చితే వెనకబడి ఉన్న తెలంగాణలో 1971 నుంచి హైస్కూళ్లు బాగా పెరిగాయి.

ఉన్నత విద్య వ్యాప్తి
స్వాతంత్య్రం ముందునుంచి ఇప్పటివరకూ రాష్ర్టంలో అన్ని ప్రాంతాల్లోనూ ఉన్నత విద్యను పరిశీలిస్తే... 1. తెలంగాణ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో యువత సంఖ్య సమానంగానే ఉన్నా తెలంగాణ కన్నా కోస్తాంధ్రలో డిగ్రీ కాలేజీలు, డిగ్రీ చదివే విద్యార్థుల సంఖ్య ఎక్కువ. రాష్ర్టం ఏర్పడిన సమయంలో కోస్తాంధ్రలో ఎయిడెడ్ కాలేజీల సంఖ్య ఎక్కువగా ఉండడం దీనికి కారణం. ఉన్నత విద్యలోకి తెలంగాణ ఆలస్యంగా ప్రవేశించడంతో ఇక్కడ ఎయిడెడ్ కాలేజీల సంఖ్య పరిమితంగా ఉంది. 2. ప్రభుత్వ కాలేజీలలో కోస్తాంధ్రతో పోలిస్తే తెలంగాణ, రాయలసీమలలో విద్యార్థి-లెక్చరర్ నిష్పత్తి ఎక్కువగా ఉంది. ఈ నిష్పత్తి తెలంగాణలోని ఆదిలాబాద్ (82), కరీంనగర్ (61)లలో చాలా ఎక్కువ. టెక్నికల్, ప్రొఫెషనల్ కాలేజీలు/సంస్థల విషయానికొస్తే మిగిలిన ప్రాంతాలకన్నా తెలంగాణదే పైచేయి.

అయితే అవన్నీ రంగారెడ్డి, హైదరాబాద్‌లలోనే కేంద్రీకృతమై ఉన్నాయి. వీటిని మినహాయిస్తే రాయలసీమ, కోస్తాంధ్ర కన్నా (బీఈడీ, లా కాకుండా) తెలంగాణ వెనకబడి ఉంది. హైదరాబాద్, రంగారెడ్డిలలోని ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ కాలేజీలలో అధికభాగం ప్రైవేటు కాలేజీలే. తెలంగాణలోని ఈ రెండుచోట్ల, కోస్తాంధ్రలోని కొన్ని జిల్లాల్లోనే మార్కెట్ శక్తులు ఎందుకు కేంద్రీకరించాయో వేరే చెప్పనక్కరలేదు. అందుకే భవిష్యత్‌లో ప్రభుత్వ కాలేజీలు ఏర్పాటు చేసేటపుడు ప్రభుత్వం వెనుకబడిన జిల్లాలను దృష్టిలో ఉంచుకోవాలి. ఇన్సెంటివ్‌లు/సబ్సిడీలు ఇచ్చి ప్రైవేటు రంగాన్నీ ఆ జిల్లాలలో కాలేజీలు నెలకొల్పేలా ప్రోత్సహించాలి.

1 comment:

  1. See the last paragraph. But what Y.S.Rajasekhara Reddy did? He shifted I.I.T. from Basar to Hyderabad. Don't we understand with what motive he did this? Isn't he a traitor?

    ReplyDelete