....

Footer Right Content

Sunday, August 29, 2010

ఢిల్లీ తెలుగు వారిని ఉర్రూతలూగించిన 'జనంపాట-జనంమాట'

తెలంగాణా సాయుధ పోరాట యోధుడు, ప్రజా కవి సుద్దాల హనుమంతు శతజయంతి ఉత్సవం ఢిల్లీలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన 'జనంపాట-జనంమాట' కార్యక్రమం స్థానిక తెలుగు ప్రజలను ఉర్రూతలూగించింది. మూడు గంటలకు పైగా ఏకబిగిన సాగిన సాంస్కృతిక సాయంత్రం ఆహూతులను కట్టిపడేసింది. ఆదివారం ఇక్కడి ఆంధ్రప్రదేశ్‌ భవన్‌లో సాహితి, ఆంధ్ర అసోసియేషన్‌ సంస్థలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పాత్రికేయులు ఎ. కృష్ణారావు అధ్యక్షతన ఈ సందర్భంగా జరిగిన సదస్సులో ప్రజాశక్తి మాజీ సంపాదకులు వి.శ్రీనివాసరావు, సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ, ఉద్యమ గేయ రచయిత, గాయకుడు గోరటి వెంకన్న, ఆశుకవి అందెశ్రీ, ఆంధ్రా అసోసియేషన్‌ అధ్యక్షులు కోటగిరి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ప్రపంచీకరణ ప్రభావం వల్ల ప్రజా కళలు కార్పొరేట్‌ కౌగిలిలో విలవిలలాడుతున్నాయని తన ప్రారంభోపన్యాసంలో శ్రీనివాసరావు పేర్కొన్నారు. ' కామన్‌వెల్త్‌ క్రీడల కోసం తాను రూపొందించిన థీమ్‌సాంగ్‌కు ఎఆర్‌ రహమాన్‌ ఐదున్నర కోట్లు వసూలు చేశారు. పల్లెటూరి పిల్లగాడా....అంటూ తెలంగాణా ప్రజానీకాన్ని తట్టిలేపిన సుద్దాల హనుమంతకు మనం ఎన్నికోట్లు ఇవ్వాలి ?

ప్రజల కోసం పనిచేశాడు కాబట్టే వంద సంవత్సరాల తర్వాతా ఆయన్ను మనం స్మరించుకుంటున్నాం. ఆయన ప్రజాభక్త హనుమంతు..రామభక్త హనుమంతు కాదు..కాబట్టే ఆయన చిరంజీవి ' అని శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. అవార్డులు, రివార్డులు లేకపోయిన ప్రజలిచ్చిన ప్రజాకవి అన్న బిరుదు ముందు అన్నీ దిగదుడుపేనని పేర్కొన్నారు. ప్రజా కళలను హనుమంతు వంటి ప్రజా కళాకారులను ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగానే మరుగునపరిచే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. వ్యాపార ధోరణుల మధ్య చిక్కిశల్యమౌతోన్న ప్రజా కళలను కాపాడటమే హనుమంతుకిచ్చే నిజమైన నివాళి అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణా ప్రజల దుర్భర జీవిత పరిస్థితులే తన తండ్రిని ఒక ప్రజాకవిగా మార్చాయని అశోక్‌తేజ పేర్కొన్నారు. ఆర్య సమాజంలో క్రియాశీలంగా పనిచేసిన తన తండ్రిని పేదల బాధలే కమ్యూనిస్టుగా మలిచాయని వివరించారు. నూరు ఉపన్యాసాలు, నాటికల కంటే ఒక్క పాట ఎంతో శక్తివంతమైనదని హనుమంతు సుధృడంగా నమ్మారని పేర్కొన్నారు. సుద్దాల హనుమంతు ట్రస్ట్‌ అధ్వర్యంలో ఇకపై ప్రతిఏటా జానపద గాయకులు, పరిశోధకులకు అవార్డు ఇవ్వనున్నట్లు అశోక్‌తేజ ప్రకటించారు. ఆస్తులు కూడబెట్టే అవకాశాలు ఉండీ, ప్రజల కోసం జీవితాన్ని త్యాగం చేసిన హనుమంతే తమకు స్ఫూర్తని వెంకన్న పేర్కొన్నారు. వేమన, అన్నమాచార్య వలె సుద్దాల నిజమైన ప్రజాకవని ప్రశంసించారు.
అలరించిన జానపదాలు
సదస్సు అనంతరం వక్తలు పాడిన జానపదాలు శ్రోతలను విశేషంగా ఆకర్షించాయి. మూడు గంటలకు పైగా ఎంతో ఉత్సాహంతో సభికులు ఈ కార్యక్రమంలో లీనమవ్వడమే ఇందుకు నిదర్శనం. పల్లె కన్నీరు పెడుతుందో...అంటూ వెంకన్న, నేలమ్మనేలమ్మ నేలమ్మా...అంటూ అశోక్‌తేజ, నది నడిచిపోతున్నదీ...అంటూ అందెశ్రీ ఉత్తేజపూరితంగా పాడిన పాటలు ఢిల్లీ తెలుగు ప్రజలను స్పందింప చేశాయి. ప్రజా కళాకారులు చైతన్య, ఉదరు తదితరులూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

No comments:

Post a Comment