మరో తెలుగుతేజం మెరిసింది. పాటల పూదోటలోవిరజాజియై గుభాళించింది. గానామృతంతో భారతావని మదిని పులకింపజేసింది. తెలుగోడి ఉచ్ఛ్వాస, నిశ్వాసలు రాగమై, తానమై, పల్లవించాయి. ఎద ఎదనూ రంజింపజేశాయి. మదిమదినీ దోచేశాయి. పంద్రాగస్టు పర్వదినాన మన శ్రీరామ్ మహోన్నత శిఖరాన్ని అధిరోహించాడు. ఇండియన్ ఐడల్గా ఆవిర్భవించాడు. హైదరాబాద్ పాటే గెలిచింది. సోనీ టీవీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఇండియన్ ఐడల్-5 మ్యూజిక్ రియాలిటీ షోలో తెలుగు కుర్రాడు శ్రీరామ్ విజయకేతనం ఎగురవేశాడు. పోటీలు జరుగుతున్న తొలి రోజు నుంచీ శ్రావ్యమైన తన గొంతుతో శ్రీరామ్ అందరినీ ఆకట్టుకున్నాడు.శ్రీరామ్ను జడ్జీలు పొగడ్తలతో ముంచెత్తని రోజు లేదు. ఇండియన్ ఐడల్ పోటీల్లో శ్రీరామ్ చూపిన ప్రతిభకు సలామ్ కొట్టనివారు లేరు. మొన్న శ్రీరామ్ పాడిన 'క్వాజా మేరీ క్వాజా' అన్న పాటకు సంజయ్దత్ ఏకంగా కళ్లనీళ్లు పెట్టుకున్నాడు. డ్రీమ్గర్ల్ హేమమాలిని తెలుగులో మాట్లాడించుకుని తనకు నచ్చిన పాటను పాడించుకుంది. హాట్గర్ల్ బిపాసాబసు, కత్రినాకైఫ్ జాతీయ ఉత్తమ నటి ప్రియాంక చోప్రా ఇలా యువతరం హీరోయిన్లూ శ్రీరామ్ పాటను మనస్ఫూర్తిగా మెచ్చుకున్నారు. విలక్షణ నటుడు అమీర్ఖాన్.... 'ఆ కిశోర్కుమారే' పాడుతున్నాడా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీంతో శ్రీరామ్ తొలినుంచీ హాట్ఫేవరేట్గా మారిపోయాడు. అనుకున్నట్లే... ఇండియన్ ఐడల్ పోటీల్లో విజేతగా నిలిచి తెలుగువారి హృదయాలను ఆనందంతో నింపేశాడు 24 ఏళ్ల మైనంపాటి శ్రీరామచంద్ర. 

ఆదివారం రాత్రి సోనిటీవీలో ఇండియన్ ఐడల్ గ్రాండ్ ఫినాలే కార్యక్రమాన్ని స్వయంగా వీక్షించిన ముఖ్యమంత్రి రోశయ్య... శ్రీరామ్ గెలుపుపై హర్షం వ్యక్తం చేశారు. గాయకుడు శ్రీరామ్ను ఆయన అభినందించారు. తెలుగువారందరికీ ఇది గర్వకారణమనిఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్లో మిన్నంటిన సంబరాలు
ఇండియన్ ఐడల్గా గెలిచాడన్న మరుక్షణం హైదరాబాద్లో సంబరాలు మిన్నంటాయి. ఖైరతాబాద్, నెక్లెస్రోడ్, సికింద్రాబాద్ సహా ఇతర ప్రాంతాల్లో యువకులు రోడ్లపైకి వచ్చి సంబరాలు జరుపుకొన్నారు. బోయిన్పల్లిలోని శ్రీరామచంద్ర నివాసం వద్ద కుర్రకారు, శ్రీరామ్ స్నేహితులు కేరింతలు కొట్టారు. బాణాసంచా కాల్చారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లోనూ కొందరు యువకులు శ్రీరామ్ గెలవాలంటూ జాతీయ పతాకాలను ధరించి ప్రచారం నిర్వహించారు. గతంలో ఇండియన్ ఐడల్ పోటీల్లో పాల్గొన్న హేమచంద్ర, కారుణ్యలు ఫైనల్స్ వరకూ వెళ్లినా గెలుపునకు కొంచెం దూరంలో ఆగిపోయారు. ఈ పోటీల్లో కచ్చితంగా గెలవాలన్న పట్టుదలతో ముందునుంచీ కృషి చేసిన మైనంపాటి శ్రీరామచంద్ర ప్రతి దశలోనూ అంతకంతకూ మెరుగైన ప్రతిభను ప్రదర్శించాడు. తెల్లవారు జామునుంచే లేచి రోజుకు పదహారు, పదిహేడు గంటలపాటు సాధన చేసేవాడు. రెండు సార్లు డేంజర్ జోన్లోకి వెళ్లినా... మళ్లీ బయటకు వచ్చి ఫైనల్కు చేరుకున్నాడు. బాలీవుడ్ నటులు, సంగీత దర్శకుల అభిమానం చూరగొన్న శ్రీరామ్కు ఆశేష తెలుగు ప్రజలు కూడా సంక్షిప్త సందేశాలతో మద్దతు పలికారు. ఎవరికి ఎక్కువ సంక్షిప్త సందేశాలు వస్తే... వాళ్లే ఇండియన్ ఐడల్-5 పోటీల్లో విజేతగా నిలుస్తారన్న సమాచారాన్ని స్నేహితులు, బంధువులే ప్రచారం చేయడమే కాకుండా కొన్ని తెలుగు టీవీఛానెళ్లు ప్రసారం చేయడంతో ఎక్కువ మంది స్పందించి సంక్షిప్త సందేశాలు పంపించారు.
he is an excellent performer. extordinay
ReplyDelete