....

Footer Right Content

Thursday, May 27, 2010

తెలుగుతేజం జిలుగులు

ఐఐటీ ప్రవేశ పరీక్షా ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్‌ విజయభేరి మోగించింది. జాతీయ స్థాయిలో సార్వత్రిక విభాగంలో మొదటి ర్యాంకుతోపాటు మొదటి 10 ర్యాంకుల్లో ఏడు మనకే దక్కాయి. వికలాంగుల, ఓబీసీ విభాగాల్లోనూ జాతీయ మొదటి ర్యాంకులను మన రాష్ట్రమే సొంతం చేసుకుంది. మొత్తం 1500మంది దాకా మన రాష్ట్రం నుంచి ఐఐటీల్లో సీట్లు పొందే అవకాశముందని అంటున్నారు. సార్వత్రిక విభాగంలో వరంగల్‌ జిల్లా హన్మకొండకు చెందిన అనుముల జితేందర్‌రెడ్డి జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకును సొంతం చేసుకున్నారు. ఓబీసీ విభాగంలో కొల్లి వెంకట ఉదయ్‌కి మొదటి ర్యాంకు దక్కింది. వికలాంగుల విభాగంలో జాతీయ మొదటి ర్యాంకు తూర్పు గోదావరి జిల్లాకు పెండ్యాల ప్రవీణ్‌ కుమార్‌కు దక్కించుకున్నారు. సార్వత్రిక విభాగంలో హైదరాబాద్‌లోని చైతన్యపురికి చెందిన ఉదయ్‌ షాకి 2వ ర్యాంకు దక్కింది. నాలుగో ర్యాంకును కృష్ణా జిల్లాకు చెందిన మధు కిరణ్‌, 6వ ర్యాంకును మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన సాత్విక్‌, 7వ ర్యాంకును గుంటూరు జిల్లాకు చెందిన ఎ.జనార్దన్‌రెడ్డి, 8వ ర్యాంకును హైదరాబాద్‌కు చెందిన శబరీశ్‌, 9వ ర్యాంకును విశాఖపట్నానికి చెందిన నీరజ్‌ గోపాల్‌ సాధించారు.
అమ్మాయిల్లో మొదటి ర్యాంకు ఆకాంక్ష తుషార్‌ సర్దాకు దక్కింది. (ఆమె జాతీయ స్థాయి ర్యాంకు 18). నిరుపేదలకు శిక్షణనిస్తున్న పాట్నాలోని సూపర్‌-30 సంస్థ నుంచి పరీక్షకు హాజరైన 30 మంది విద్యార్థుల్లో అందరూ ఐఐటీల్లో సీట్లు పొందేందుకు అర్హత సాధించడం విశేషం.
బుధవారమిక్కడ విడుదలైన ఐఐటీ ఫలితాల్లో మొత్తం 13,104 మంది అర్హత సాధించారు. ఏప్రిల్‌ 11న నిర్వహించిన ఈ పరీక్షకు మొత్తం 4.72 లక్షల మంది హాజరయ్యారు. గత ఏడాది కంటే ఈసారి 18.3 శాతం మంది అధికంగా పరీక్షకు హాజరయ్యారు. ఫలితాల్లో ముంబయి ప్రాంతీయ విభాగం విద్యార్థులు అత్యధిక సీట్లు సాధించి మొదటి స్థానంలో నిలిచారు. ఆ తర్వాతి స్థానం ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిథ్యం వహించే మద్రాస్‌దే.


ప్రవేశ పరీక్షకు హాజరైన మొత్తం విద్యార్థులు: 4.72 లక్షల మంది
అర్హత సాధించినవారు: 13,104 మంది
పరీక్షకు హాజరైన బాలికలు: 1.13 లక్షల మంది
అర్హత సాధించిన బాలికలు: 1476 మంది
హిందీ మీడియంలో అర్హత సాధించినవారు: 554మంది
అర్హత సాధించిన ఓబీసీ విద్యార్థులు: 2,357 మంది
అర్హత సాధించిన ఎస్సీ విద్యార్థులు: 1,773 మంది
అర్హత సాధించిన ఎస్టీ విద్యార్థులు: 517 మంది
వికలాంగ విద్యార్థులు: 174 మంది





ప్రాంతాలవారీగా సాధించిన సీట్లు
ముంబయి: 3,145, మద్రాస్‌: 2,619, ఢిల్లీ: 2,264, ఖరగ్‌పూర్‌: 1,481, కాన్పూర్‌: 1,341, రూర్కీ: 1,305, గౌహతి: 521.
మొత్తం ఐఐటీలు: 15, మొత్తం సీట్లు: 9,509, 
ఈ ప్రవేశ పరీక్షద్వారా ప్రవేశాలు కల్పించే ఇతర విద్యాసంస్థలు: 2
ఐఐటీలివే: హైదరాబాద్‌, భువనేశ్వర్‌, ఢిల్లీ, ముంబయి, గాంధీనగర్‌, గౌహతి, ఇండోర్‌, కాన్పూర్‌, ఖరగ్‌పూర్‌, మద్రాస్‌, మండి, పాట్నా, రాజస్థాన్‌, రోపార్‌, రూర్కీ. ఇతర విద్యాసంస్థలు: ఐటీ- బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం, ఐఎస్‌ఎం ధన్‌బాద్‌.


నేటి నుంచే ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌
ఐఐటీల్లో సీట్ల భర్తీకి తొలిసారిగా ఆన్‌లైన్‌ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌ గురువారం నుంచే విద్యార్థులకు అందుబాటులో ఉంటుంది. *ఈ నెల 30వ తేదీ నుంచి జూన్‌ 12 వరకూ విద్యార్థులు తమకు నచ్చిన కోర్సులను పేర్కొంటూ ఆన్‌లైన్‌ దరఖాస్తులను నింపాల్సి ఉంటుంది.
*సాధారణ కేటగిరీ అభ్యర్థులు కౌన్సెలింగ్‌ నిర్వహించే కేంద్రాలకు వ్యక్తిగతంగా హాజరుకావాల్సిన అవసరం లేదు.
*ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, వికలాంగ విద్యార్థులు మాత్రం ఏదో ఒక కౌన్సెలింగ్‌ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది.
*జూన్‌ 29వ తేదీన సీట్లు పొందిన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేస్తారు.
*జులై 14వ తేదీన రెండో జాబితాను విడుదల చేస్తారు.


ఉదయ్‌ కె. షా
10వ తరగతిలో మార్కులు: 533
ఇంటర్మీడియేట్‌: నారాయణ కళాశాల, హైదరాబాద్‌
మార్కులు: 942 (94.2 శాతం)
కుటుంబ నేపథ్యం: తండ్రి కాంతీలాల్‌. ప్రస్తుతం హైదరాబాద్‌లోని చైతన్యపురిలో నివాసం. ప్రైవేటు కంపెనీలో మేనేజరు. తల్లి మితా గృహిణి.
ఏమీ నిర్ణయించుకోలేదు: మొదటి ఐదులో ర్యాంకు వస్తుందని వూహించా. అలాగే జరిగింది. విజయ రహస్యం అంటూ ఏమీ లేదు. ఫలానా ర్యాంకు రావాలన్న ఒత్తిడి ఇంట్లో లేకపోవడంతో పెద్దగా ఇబ్బంది పడలేదు. నా వరకు నాకు మంచి ర్యాంకు వస్తుందన్న నమ్మకం ఉంది. అందుకే పెద్దగా ఆందోళన చెందలేదు. భవిష్యత్తులో ఏం చేయాలో నిర్ణయించుకోలేదు. 'నీకు తెలివితేటలు ఉన్నాయి. అల్లరితో పాటు వాటిని ఉపయోగించి చదువు మీద పెట్టు' అని సున్నితంగా ఎప్పటికప్పుడు కౌన్సెలింగ్‌ చేస్తుంది. ఇది నాపై ప్రభావం చూపింది.


జి.నీరజ్‌ గోపాల్‌
విద్యాభ్యాసం: పదో తరగతి వరకూ ఒమన్‌లో..
ఇంటర్మీడియేట్‌: విశాఖపట్నంలోని బీహెచ్‌పీవీ
మార్కులు: ఇంటర్‌ (సీబీఎస్‌) 95 శాతం మార్కులు.
ఐఐటీ ఎంట్రన్స్‌ కోచింగ్‌:నారాయణ ఐఐటీ అకాడమీ, విశాఖపట్నం.
కుటుంబ నేపథ్యం: స్వస్థలం కేరళ. తండ్రి రమేశ్‌ గోపాల్‌ ఉద్యోగరీత్యా విశాఖపట్నంలో స్థిరపడ్డారు. ఆయన స్టీల్‌ ప్లాంట్‌లో మేనేజర్‌. తల్లి అనితా గోపాల్‌ గృహిణి.
ప్రత్యేకతలు: కేవీపీవై ఆల్‌ఇండియా సైంటిస్టు అవార్డుతో పాటు ఇంటర్నేషనల్‌ ఫిజిక్స్‌ ఒలింపియాడ్‌ ఎంపికయ్యారు. ఇంజినీరింగ్‌ సాంకేతిక విభాగంలో...
ఉద్యోగరీత్యా నాన్న గల్ఫ్‌కి వెళ్లడంతో 8,9,10 తరగతులు అక్కడే చదివా. ఇంటర్‌ కోసం వైజాగ్‌ వచ్చాం. టాప్‌ ట్వంటీలో ర్యాంకు వస్తుందని వూహించా. అందుకు భిన్నంగా తొమ్మిదో ర్యాంకు వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. నేనెప్పుడు కష్టపడి చదవను. ఇష్టపడి చదువుతా. అందువల్లే మంచి ర్యాంకు వచ్చిందని అనుకుంటున్నా. కాలేజీలో మాస్టర్‌ బాగా చదివించాలనుకుంటారు. ప్రతి విద్యార్థి మంచి మార్కులు రావాలని ఆశిస్తాడు. నేనూ అంతే. ఇద్దరి లక్ష్యం ఒక్కటే అయినప్పుడు కాస్త ఇష్టపడి చదివితే అంతా హ్యాపీనే అని నమ్ముతా. దాన్నే పాటిస్తా. ఫలానా ర్యాంకు రావాలన్న ఒత్తిడి ఇంట్లో ఎప్పుడూ లేదు. భవిష్యత్తులో ఇంజినీరింగ్‌ టెక్నికల్‌ విభాగంలో పని చేయాలనుకుంటున్నా.


మధుకిరణ్‌
విద్యాభ్యాసం: కేంద్రీయ విద్యాలయ, నారాయణ ఒలింపియాడ్‌ స్కూల్‌
10వ తరగతిలో మార్కులు: 94శాతం
ఇంటర్మీడియేట్‌: నారాయణ కళాశాల
కుటుంబ నేపథ్యం: తండ్రి పీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి, తల్లి ప్రభుత్వ పాఠశాలలో హిందీ ఉపాధ్యాయురాలు. 
పారిశ్రామికవేత్తనవుతా: నాన్న మొదట్లో బస్‌ కండక్టరుగా, తర్వాత 20 ఏళ్లు ఈనాడు పేపర్‌ ఏజెంటుగా ఉన్నారు. ప్రస్తుతం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారు. నేను ఎంతసేపూ తరగతి గదుల్లో అధ్యాపకులు చెప్పినది శ్రద్ధగా వినేవాడినే తప్ప ఇంటికెళ్లిన తర్వాత పెద్దగా చదివిందిలేదు. 25లోపు ర్యాంకు వస్తుందని అనుకున్నా కానీ ఏకంగా నాలుగో ర్యాంకులో ఉంటానని వూహించలేదు. నాకు చాలా సంతోషంగా ఉంది. ముంబయిలో ఐఐటీ చేశాక ఎంబీఏ చేయాలని అనుకుంటున్నాను. భవిష్యత్తులో సొంతంగా పరిశ్రమ పెట్టి పదిమందికి ఉపాధి కల్పించాలనేది నా కోరిక.


సాత్విక్‌
విద్యాభ్యాసం: హైదరాబాద్‌లో, ఐఐటీ రామయ్య విద్యా సంస్థలో... ఇంటర్లో మార్కులు: 962
కుటుంబ నేపథ్యం: తండ్రి శ్రీనివాసరావు హైదరాబాద్‌లోని ప్రైవేటు కంపెనీలో మేనేజరు.
నిరంతర శ్రమవల్లే...: నిరంతర శ్రమవల్లే ఈ స్థానం దక్కింది. అధ్యాపకులు, తల్లిదండ్రుల సహకారం మరువలేనిది. రోజూ అధ్యాపకులు చెప్పిన పాఠాలే కాకుండా అదనంగా 4 గంటలు చదివేవాడిని.


అన్నపరెడ్డి జనార్థన్‌రెడ్డి
విద్యాభ్యాసం: పదో తరగతి వరకూ కేంద్రీయ విద్యాలయ
10వ తరగతిలో మార్కులు: 474 (సీబీఎస్‌ఈ, 95%)
ఇంటర్మీడియేట్‌: శ్రీచైతన్య విద్యాసంస్థ
మార్కులు: 964 (96.4 శాతం)
కుటుంబ నేపథ్యం: తండ్రి అన్నపరెడ్డి జ్ఞానదేవరెడ్డి గుంటూరులో నివాసముంటున్నారు. ఆయన మాజీ సైనికోద్యోగి. ప్రస్తుతం ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటున్నారు. తల్లి ధనలక్ష్మి. ఆమె గృహిణిగా ఉంటున్నారు. 'కలెక్టరు కావడమే ధ్యేయం'
ముంబయిలోగానీ చెన్నైలోగానీ కంప్యూటరు సైన్సు కోర్సులో చేరాలనుకుంటున్నాను. వందలోపు ర్యాంకు వస్తుందని అనుకున్నా. ఈ ర్యాంకు సాధిస్తానని ఉహించలేదు. వీఐటీలో రెండో ర్యాంకు వచ్చింది. కలెక్టరు కావాలన్నదే నా ధ్యేయం.


కొల్లి వెంకట ఉదయ్‌నాధ్‌
ఐఐటీ ర్యాంకు: ఓబీసీ విభాగంలో 1
విద్యాభ్యాసం: టింపని స్కూల్‌, విశాఖపట్నం
10వ తరగతిలో మార్కులు: 444 (సీబీఎస్‌ఈ)
ఇంటర్మీడియేట్‌: నారాయణ జూనియర్‌ కళాశాల, విశాఖపట్నం
మార్కులు: (సీబీఎస్‌ఈ ) 94.8 శాతం
కుటుంబ నేపథ్యం: స్వస్థలం విశాఖపట్నం. తండ్రి కొల్లి వెంకటరమణ స్పెషల్‌ డిప్యూటీ తహసీల్దారుగా విశాఖ కలెక్టరేట్‌లో పని చేస్తున్నారు. తల్లి కొల్లి పద్మజారాణి గృహిణి. సివిల్స్‌ వైపే...
50లోపు ర్యాంకు వస్తుందనుకున్నా. ఇంత మంచి ర్యాంకు రావటం ఊహించలేదు. ముంబయి ఐఐటీలో కంప్యూటర్‌ సైన్స్‌లో చేరాలనుకుంటున్నా. అనంతరం సివిల్స్‌పై దృష్టి సారిస్తా. రోజుకు 12 గంటలు చదివేవాడిని. తల్లిదండ్రులెప్పుడూ ఫలానా ర్యాంకు రావాలన్న ఒత్తిడి చేయలేదు. నారాయణ అధ్యాపకులు చాలా సాయం చేశారు. విట్‌లో జాతీయ స్థాయిలో 14వ ర్యాంకు వచ్చింది. ఈ పరీక్షను 1.54 లక్షల మంది రాశారు. టీవీ చూడటం, క్రికెట్‌ అంటే ఇష్టం. ఒత్తిడికి గురైనప్పుడు కంప్యూటర్‌ గేమ్స్‌ ఆడటం ద్వారా రిలాక్స్‌ అవుతా. ప్రస్తుతం ముంబయిలోని హోమీ బాబా సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ ఇనిస్టిట్యూట్‌లో ఇంటర్నేషనల్‌ కెమిస్ట్రీ ఒలంపియాడ్‌ కోసం శిక్షణ పొందుతున్నా.


పి.ప్రవీణ్‌ కుమార్‌
విద్యాభ్యాసం: గౌతమ్‌ మోడల్‌ స్కూల్‌, రాజమండ్రి
10వ తరగతిలో మార్కులు: 542 మార్కులు
ఇంటర్మీడియేట్‌: విజయరత్న జూనియర్‌ కాలేజ్‌, నల్లకుంట, హైదరాబాద్‌
మార్కులు: 948 (94.8 శాతం)
కుటుంబ నేపథ్యం: స్వస్థలం రాజమండ్రిలోని రంగంపేట మండలంలోని వడిశలేరు. తండ్రి వెంకట్రావ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌ నల్లకుంటలో నివాసముంటున్నారు. వ్యవసాయం చేస్తుంటారు. అమ్మ వీర కుమారి గృహిణి. పరిశోధనలపై...
ఒకటో ర్యాంకు వస్తుందని ముందే ఊహించా. గతేడాది ఇదే విభాగంలో మొదటి ర్యాంకరుకు వచ్చిన మార్కులను చూసి... నేను రాసిన దాన్ని అనుసరించి ఈ ర్యాంకు వస్తుందని ముందే ఊహించా. అది నిజమైంది. ఇంట్లో వారంతా చాలా సంతోషంగా ఉన్నారు. ఐఐటీ ముంబైలో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ చేరాలని భావిస్తున్నా. ఒక కన్ను కనిపించకున్నా ఎప్పుడూ అలా ఫీల్‌ అవలేదు. భవిష్యత్తులో పరిశోధన రంగంవైపు దృష్టి సారించి దేశానికి ఉపయోగపడే ఏదో ఒక వస్తువుని రూపొందించాలని అనుకుంటున్నా.


ఏ జితేందర్‌రెడ్డి
విద్యాభ్యాసం: సెయింట్‌ గేబ్రియల్‌ స్కూల్‌, వరంగల్‌
10వ తరగతిలో మార్కులు: 552
ఇంటర్మీడియేట్‌: నారాయణ కళాశాల, దిల్‌సుఖ్‌నగర్‌, హైదరాబాద్‌
మార్కులు: 953 (95.3 శాతం)
కుటుంబ నేపథ్యం: తండ్రి రాంచంద్రారెడ్డి వరంగల్‌లోని హన్మకొండలో ఉంటున్నారు. ఆయన వరంగల్‌ ఎన్‌ఐటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. తల్లి శోభ. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. పరిశోధనలపైనే దృష్టి
వూహించిన దాని కంటే మంచి ర్యాంకు వచ్చింది. మొదటి ఐదులో వస్తుందనుకున్నా. మొదటి ర్యాంకు రావడం ఆనందంగా ఉంది. తల్లిదండ్రుల ప్రోత్సాహం, కళాశాలలోని అధ్యాపకుల సూచనలు మంచి ర్యాంకు వచ్చేలా చేశాయి. రోజూ కచ్చితంగా ఇంత సమయం చదవాలనుకోలేదు. ఎప్పుడు చదవాలనిపిస్తే అప్పుడు చదివేవాడిని. ఇంట్లో కూడా ఒత్తిడి లేదు. ముంబయి ఐఐటీలో ఈసీఈ చేయాలన్నది లక్ష్యం. భవిష్యత్తులో పరిశోధనలపై దృష్టి సారించాలని భావిస్తున్నా.


అభినయ్‌ స్వరూప్‌
ఐఐటీ ర్యాంకు: ఎస్‌సీ కేటగిరీలో రెండో ర్యాంక్‌
విద్యాభ్యాసం: పదివరకు కేంద్రీయ విద్యాలయ
10వ తరగతిలో మార్కులు: 476 (సీబీఎస్‌ఈ)
ఇంటర్‌: శ్రీచైతన్య విద్యాసంస్థ, మార్కులు: 959
కుటుంబ నేపథ్యం: తండ్రి భక్తవత్సలం. బీకాం చదివారు. తల్లిపేరు కృష్ణకుమారి గృహిణి. గుంటూరు సమీపంలోని అడవితక్కెళ్లపాడులో నివాసం ఉంటున్నారు. ఆయన మొదట్లో మెకానిక్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఇందిరా క్రాంతి పథం కింద కాంట్రాక్టరుగా పనిచేస్తున్నాడు. నెలకు కేవలం నాలుగు వేల రూపాయలను మాత్రమే సంపాదిస్తున్నారు. ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నా: ముంబయి ఐఐటీలో చేరతాను. ఎస్‌.సి. కోటాలో పదిలోపు ర్యాంకు వస్తుందని ఆశించా. ఈ ర్యాంకు సాధిస్తానని ఉహించలేదు. కలెక్టరుగా ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నా.
విశేషం: మాది కష్టపడే కుటుంబమనే విషయాన్ని పెద్దది చేసి రాయొద్దు. నాకు ఎటువంటి సాయం అక్కర్లేదు. స్కాలర్‌షిప్‌తో ఐఐటీ పూర్తి చేయగలననే నమ్మకం నాకు ఉంది.


మేఘన కట్టా
ఐఐటీ ర్యాంకు: ఎస్‌సీ కేటగిరీలో 5
విద్యాభ్యాసం: పదో తరగతి వరకు ఖమ్మం, వరంగల్‌, 10వ తరగతిలో మార్కులు: 550
ఇంటర్మీడియేట్‌: నారాయణ దిల్‌సుఖ్‌నగర్‌, మార్కులు: 93శాతం
కుటుంబ నేపథ్యం: తండ్రి ఎలీషా ఒంగోలులోని పంచాయతీరాజ్‌శాఖలో ఇంజినీరుగా పనిచేస్తున్నారు. తల్లి పేరు శారద. ఈమె వరంగలులోని హన్మకొండలో బాటనీ లెక్చరరుగా ఉన్నారు.
ఎంబీఏ చేస్తా: ముంబయి ఐఐటీలో ఈసీఈ కోర్సులో చేరాలనుకుంటున్నాను. ఐఏఎం ద్వారా ఎంబీఏ పూర్తి చేయాలనేది లక్ష్యం. ఐఐటీల్లో విద్యార్థినులు తక్కువగా చేరుతున్నారు. తల్లిదండ్రులు ఈ విషయంలో అమ్మాయిలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.

No comments:

Post a Comment