....

Footer Right Content

Saturday, August 13, 2011

తెలుగు తల్లికి వెలుగు నీరాజనం

నేటి నుంచి ప్రపంచ తెలుగు రచయితల రెండో మహాసభలు
విజయవాడ నగరంలో నేటి నుంచి మూడు రోజులు తెలుగు తల్లికి వెలుగు నీరాజనం! తెలుగు భాష, సాహిత్య, సంస్కృతి, పద్య, గద్య, వచన, కవిత, విమర్శ ప్రేమికులు తమ సాహితీ దాహార్తిని తీర్చుకునేందుకు ‘ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు’ వేటూరి సుందరరామమూర్తి కళా వేదికపై(తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం) నేడు అత్యంత శోభాయమానంగా ప్రారంభంకానున్నాయి. ఈ ప్రారంభ వేడుకలకు తెలుగు తల్లి పాదాలకు వెలుగు పారాణిని అద్దిన అతిరథ మహారథులు హాజరు కానుండడం విశేషం.

ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ ప్రపంచ మహాసభలకు ఖండాతరాల నుంచి సైతం తెలుగు అభిమానులు క్యూ కడుతున్నారు. ఇక, దేశంలోని లబ్ధ ప్రతిష్టులైన తెలుగు కవులు, రచయితలు, కళాకారులు ఈ వేడుకలను తెలుగునాట మూడు రోజుల పండుగ లా భావిస్తుండడం అతిశయోక్తి అనిపించినా నిజం! పరస్పర పరిచయాలు, కవిత్వ రసమాధుర్యాల పంపకాలు వంటివి ఇక మామూలే!! 2007 సెప్టెంబరు 21,22,23 తేదీల్లో జరిగిన తొలి సభల సుదీర్ఘ విరామానంతరం నాలుగేళ్లకు నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో ప్రతిదీ ప్రాముఖ్యమే.

జిల్లా రచయితల సంఘానికి 44ఏళ్లు
తెలుగు భాషోద్యమ స్ఫూర్తితో ఎన్నో కార్యక్రమాలను నిర్వహించిన కృష్ణాజిల్లా రచయితల సంఘానికి 44 ఏళ్ల సుదీర్ఘ సచ్చరిత్ర సొంతం. 1967 జనవరి 8న విజయవాడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాలులో జిల్లా రచయితల మహాసభలు జరిగాయి. ఒక్కరోజు మాత్రమే జరిగిన ఈ సభను పత్రికా రంగ సవ్యసాచి నార్ల వెంకటేశ్వరరావు ప్రారంభించారు. మళ్లీ ఏడాదికి 1968 మార్చి 10,11 తేదీల్లో విజయవాడ రామమోహన గ్రంథాలయంలో రెండో సభ కొలువుదీరింది. ఈ సభను స్వాతంత్య్ర సమరయోధులు, తెలుగు భాషాభిమానులు కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రారంభించారు. మూడో సభ 1970 జూన్ 27,28 తేదీల్లో గుడివాడ కవిరాజు కళామందిరంలో జరిగాయి. ఈ సభలను కవి సమ్రాట్ త్రిపురనేని వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ సభలకు చెయితిరిగిన తెలుగు రచయితలు ఆరుద్ర, సోమసుందర్, గజ్జెల మల్లారెడ్డి, ఎమ్వీయల్ తదితర ఘనాపాఠీలు హాజరై తెలుగుతల్లి కీర్తిని కొనియాడారు.

నాలుగో సభ 1976 నవంబరు 20,21 తేదీల్లో మచిలీపట్నంలో ఏర్పాటయ్యాయి. వీటిని ఏస్‌టీజీ వరదాచార్యులు ప్రారంభించారు. ఈ సభలకు ప్రముఖ సినీ రచయిత డీవీ నరసరాజు, కొండముది, అద్దేపల్లి, ఆరెస్స్ సుదర్శనం, రామ్మోహనరాయ్, లత, ఆదివిష్ణు పాల్గొన్నారు. ఆ తరువాత మహాసభలకు ఆరేళ్లు సమయం పట్టింది. 1982 జులై 10,11 తేదీల్లో అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో జరిగాయి. అప్పటి ప్రభుత్వ ఆస్థాన కవి దాశరథి సభలను ప్రారంభించారు.

కృష్ణా జిల్లా రచయితల సంఘం ఆవిర్భావం
ఐదో మహాసభల సందర్భంగా మండలి వెంకట కృష్ణారావు, ఎంఆర్ అప్పారావు సూచనల మేరకు కృష్ణాజిల్లా రచయితల సంఘం పూర్తిస్థాయిలో ఏర్పడింది. దీనికి సీ నారాయణరెడ్డి, దాశరథి, ఎంఆర్ అప్పారావు తదితరులతో గౌరవ సలహామండలి ఏర్పడింది. మరో 15 మందితో ఒక కార్యవర్గం ఏర్పడింది. 1983లో ఇదే కార్యవర్గంతో సంస్థ రిజి ష్టర్ అయింది. అనంతరం, ఆంధ్రప్రదేశ్ సాహిత్య ఆకాడమీ గుర్తింపు పొందింది. అప్పటి నుంచి ప్రతి రెండేళ్ల కొకసారి వివిధ అంశాలపై మహాసభలను నిర్వహిస్తూ వచ్చింది. సభలతోపాటు పుస్తక ప్రచురణలను భుజానికెత్తుకుంది.

తొలి ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు
దేశ స్వాతంత్య్రానికి వజ్రోత్సవ సంవత్సరం సందర్భంగా తొలి ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు జరిగాయి. 2007 సెప్టెంబరు 21,22,23 తేదీల్లో విజయవాడలోని శేషసాయి కళ్యాణ మండపం వేదికగా ఈ సభలు కొలువుదీరాయి. దాదాపు 800 మంది సాహితీ ప్రముఖులు, 10వేల మంది కవులు, రచయితలు, సాహిత్యాభిమానులు పాల్గొన్నారు. ప్రజల్లో భాషోద్యమ స్ఫూర్తిని రగిలించి, భాషాభిమానాన్ని రేకెత్తించడమే ప్రధాన అజెండాగా ఈ సభలు సాగాయి.

వజ్రభారతి గ్రంథ ఆవిష్కరణ
తొలి సభల్లో అప్పటి గవర్నర్ ఎన్‌డీ తివారీ, కేంద్రమంత్రి పురందేశ్వరి ఆవిష్కరించిన ‘వజ్ర భారతి’ సంఘం కృషికి తార్కాణమైంది. భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా 60ఏళ్లు స్వతంత్ర దేశంలో వివిధ రంగాల్లో తెలుగువారి ప్రగతి సమీక్షగా 216 వ్యాసాల ‘అనుశీలన గ్రంథం’ వెలువడింది. ఐఏఎస్, ఐపీఎస్ వంటి పోటీ పరీక్షలకు వెళ్లే వారికి ఈ గ్రంథం కరదీపికగా మారింది. విమర్శకుల ప్రశంసలూ పొందింది.

‘వేటూరి’వేదికపై ప్రారంభ వేడుక..
వేటూరి సందరరామమూర్తి వేదికపై(తుమ్మలపల్లి కళాక్షేత్రం) శనివారం ఉద యం 10గంటలకు ఈ వేడుకలను జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత పద్మభూషణ్ సీ నారాయరణరెడ్డి ప్రారంభిస్తారు. అనంతరం సభ నిర్వహిస్తారు. ఈ సభకు రచయితల సంఘం గౌరవ అధ్యక్షులు మండలి బుద్ధప్రసాద్ అధ్యక్షత వహించనున్నారు. ప్రారంభ వేడుకలకు అతిరథమహారథులు, అధికార ప్రముఖులు, పత్రికారంగ ప్రముఖులు విశేషంగా హాజరుకానున్నారు. కార్యనిర్వాహక అధ్యక్షులు పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, అధ్యక్షులు గుత్తికొండ సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జీవీ పూర్ణచంద్ కార్యక్రమాలను నిర్వహించి, పర్యవేక్షించనున్నారు.

తొలి రోజు కార్యక్రమాలు ఇవే.. వేటూరి వేదికపై..
శనివారం సాయంత్రం 5 గంటలకు డాక్టర్ గరికపాటి నరసింహారావు అష్టావదానం.
7 గంటలకు కేఆర్‌కే మెమోరియల్ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ వారి తెలుగు ప్రశస్తి నృత్య రూపకం.
8 గంటలకు ప్రతినిధుల సమ్మేళనం.
9 గంటలకు ఆచంట బాలాజీనాయుడుచే ‘మయసభ’ఏకపాత్రాభినయం.
బెంజిసర్కిల్ సమీపంలోని

‘ఎస్‌వీఎస్’ వేదికపై..
శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సురవరం ప్రతాప్‌రెడ్డి వేదికపై తెలుగు ప్రజల చరిత్ర, సంస్కృతీ, భాష ప్రాచీనతలకు సంబంధించిన పురావస్తు ఆధారాలు, చరిత్ర పరిశోధన ల ప్రదర్శన ఉంటుంది. దీనికి డాక్టర్ రాళ్లబండి కవితా ప్రసాద్ సమన్వయ కర్తగా వ్యవహరిస్తారు.

సాయంత్రం 5 గంటలకు మండలి వెంకటకృష్ణారావు వేదికపై రాష్ట్రేతర తెలుగు భాషా సమస్యలు అంశంపై సదస్సు.
సాయంత్రం 6 గంటలకు వేగుంట మోహనప్రసాద్(మో) వేదికపై ప్రత్యేక కవి సమ్మేళనం.
రాత్రి 8 గంటలకు పువ్వాడ శేషగిరిరావు వేదికపై ప్రతినిధుల కవి సమ్మేళనంతో తొలిరోజు కార్యక్రమాలు ముగుస్తాయి.

No comments:

Post a Comment